భారతీయులందరూ పూజకై, ప్రార్ధనకై ఒక గదిని లేక కొంత స్థలాన్ని తమ గృహములలో కేటాయిస్తారు. ప్రతి రోజూ దైవానికి ముందు ఒక దీపాన్ని వెలిగిస్తారు. జపము, ధ్యానము, పారాయణము, ప్రార్ధనలు, భజనలు మొదలగు ఆధ్యాత్మిక సాధనాలు కూడా ఈ ప్రార్ధనా స్థలమందు జరుపుతారు. పుట్టిన రోజు, వివాహాది దినములు మరియు పండుగలు మొదలైన అన్ని శుభ సందర్భాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. గృహములోని పెద్దలు, పిన్నలు అందరు కూడా దైవముతో సాన్నిధ్యము కలిగి పూజ చేసికొంటారు.
ప్రతి ఇంట్లో పూజగది సపరేట్ గా ఎందుకుండాలి..?
1) భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని అతనివే. మన ఇల్లు, ఆస్థులు, సంపదలూ అన్నిటికీ హక్కుదారు అతనే. ప్రతి ఇంటికీ యజమాని ఆ పరాత్పరుడే గదా! ఇంటి యజమానికి మాస్టర్ పడక గది ఉంటుంది. ఆ గదే సర్వాంతర్యామిది. మనమంతా అతని సంపదలను అనుభవిస్తున్న ఇహలోక వాసులము అంతే. ఆయజమానిని తగు మర్యాదలతో సతతమూ సేవించుట మన ఆచారము, కర్తవ్యం. అందులకే ప్రత్యక గది/ మందిరము.
2) మనము నివసించే గృహమునకు మరియు మనకు కూడా యజమాని భగవంతుడే. మనము కేవలము ఆయన గృహానికి నియమించబడ్డ నిమిత్త మాత్రులమైన సేవకులము అన్న సరైన భావన కల్గి ఉండటము ఉత్తమము. ఈ విధముగా భావించ వీలు కానిచో భగవంతుడిని మన గృహానికి విచ్చేసిన ముఖ్య అతిధిగా భావించి ఆయన సంతోషముగా ఉండడానికి పూజ గదిని కానీ, దైవ పీఠమును గాని వసతిగా కల్పించాలి. అన్ని వేళలా ఆ ప్రదేశం భ్రముగా మరియు అలంకార యుక్తంగా ఉండేలా చూడాలి (ఉన్నతాధికారి మన ఇంటికి వస్తుంటే వారికి చేసే సౌకర్యాలకన్నా కొంత ఎక్కువగానే ఉండేలా చూడాలి).
3) మన రక్షకుడు మనతోనే ఎల్లప్పుడూ ఉండుట మనకు శ్రేయస్కరము, శుభ సూచికము. యజమాని/రక్షకుడు ఒక గదిలో ఉండుట అతని సూచనలు దీవెనలతో సకల కార్యములూ జరుగుట మన ఆచారము. ప్రతీ గృహమున వివిధ పేర్లతో గదులు ఆయా ఉపయోగములకు/పనులకు కేటాయించుచున్నటులనే మనదరినీ రక్షించు ఆ పరాత్పరునికీ ఒక నివాసము ఉండవలెనన్న భావమున ఈ పూజా గృహము ఉండాలి.
4) పరమాత్మ సర్వ వ్యాపి . ఈ విషయము గుర్తుంచు కోవడానికి ఆయన మన ఇంట్లో మనతో ఉండడానికి మనము పూజా గదులను కల్గి ఉండాలి. భగవంతుని అనుగ్రహము లేనిదే మనము ఎ పనిని విజయవంతముగా చేయలేము, దేనిని సాధించ లేము. పూజ గదిలో భగవంతుడిని ప్రతి రోజూ ప్రార్ధించటము వలన సన్నిహిత సంబంధము ఏర్పడి ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందగలము.
5) ఇంటిలోని ప్రతి గది ఒక ప్రత్యేకమైన పనికి నిర్దేశింపబడి ఉంటుంది. ఆయా గదులు ఆయా నిర్దేశింపబడిన పనులకు అనుకూలము కల్గి ఉండేలాగా అమర్చి ఉంటాయి. అదే విధముగా ధ్యానానికి, పూజకు, ప్రార్ధనకు కూడా అనుకూలమైన వాతావరణము కల్గినటువంటి పూజాగది మనకు అవసరము . పవిత్రమైన ఆలోచనలు, శబ్దతరంగాలు ఆ ప్రదేశములో వ్యాపించి అక్కడకు వచ్చినవారి మనస్సుల్ని ప్రభావితము చేస్తాయి . మనము అలసిపోయినప్పుడు లేక కలత చెందినప్పుడు కేవలము ప్రార్ధనా గదిలో కొద్దిసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే కూడా చాలు ప్రశాంతత, ఉత్సాహము, ఆధ్యాత్మిక ఎదుగుదల పొందగలము.
6)దేవాలయములలో దేవునికి శతాబ్దముల నుండి చేయు అర్చన, పూజ, వేద మంత్రముల ప్రభావముచేత ఆ విగ్రహమునకూ, అ గుడికీ ఆ ప్రాధాన్యత సంతరించు చున్నది. అటులనే మన గృహమున ఉన్న పూజ గదిని కూడా భావించిన అది సకల శుభములు ప్రసాదించును.
7) దేవాలయము లోని పవిత్రత, మంత్ర ప్రభావము, వివిధపూజలు మన గృహమున లేకున్ననూ కొంతవరకు అదే ప్రక్రియ ఇచ్చటకూడా జరుగును. ఆ ఫలములు ఇచటనే లభ్యమగును. ఈ కారణముచేతనే ప్రతి గృహమున పూజ గది మందిరము సకల సౌభాగ్య దాయకమని మనవిచేయుచున్నాను.
8) పూజా మందిరంలో చీకటి అలుముకుంటే? పూజామందిరాన్ని పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటారు. కొంతమంది పూజగది ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. మరికొంతమంది వంటగదిలో భాగంగా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ప్రతినిత్యం పూజా మందిరాన్ని వివిధరకాల పుష్పాలతో అలంకరించి, భక్తిశ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు.
9) అయితే పూజామందిరం దగ్గర కూర్చుని పూజ పూర్తిచేసిన తరువాత ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతుండటం జరుగుతూ ఉంటుంది. కానీ పూజా మందిరంలో చీకటి అలుముకుని ఉండకూడదని పురోహితులు చెబుతున్నారు. పూజా మందిరంగానీ పూజ గది గాని చీకటిగా ఉండటం వలన అనేక అనర్థాలు జరుగుతాయట.
10) ఈ కారణంగానే కొంతమంది తమ ఇంట్లో అఖండ దీపారాధనకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కాస్తంత ఓపిక, తీరిక ఉన్నవాళ్లు దీపారాధన కొండెక్కకుండా చూసుకోవచ్చు.
11) అవకాశం లేనప్పుడు పూజ గదిలోను పూజా మందిరంలోను నిరంతరం విద్యుత్ దీపాలు వెలిగే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన, పూజామందిరాన్ని చీకటిలో ఉంచడం వలన కలిగే దోషాల నుంచి బయటపడవచ్చు. అనునిత్యం ఎవరి ఇంటనైతే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట కొలువై ఉండటానికి లక్ష్మీదేవి ఆసక్తిని చూపిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.